రేపు ఆ ముగ్గురు సీఎంలు బిఆర్ఎస్ సభలో పాల్గొనబోతున్నారు

ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరుగనున్న బీఆర్‌ఎస్‌ పార్టీ తొలి బహిరంగ సభ ను సక్సెస్ చేసేందుకు బిఆర్ఎస్ నేతలు , కార్య కర్తలు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ని ప్రకటించిన తర్వాత తొలిసారి భారీ బహిరంగ సభ పెడుతుండడం తో అదికూడా ఖమ్మంలో లో నిర్వహిస్తుండడం తో దేశ వ్యాప్తంగా ఈ సభ ఫై ఉత్కంఠ నెలకొంది.

ఈ సభకు బిఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు కేర‌ళ‌, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం హాజరుకాబోతున్నారు. ఇందుకోసం వీరంతా నేడు హైదరాబాద్ కు రాబోతున్నారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌మాన్ ఖ‌మ్మంలో జ‌న‌వ‌రి 18న జ‌ర‌గ‌నున్న బీఆర్‌ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కూడా నేడు హైద‌రాబాద్ చేరుకోనున్నారు. వీళ్లంతా సీఎం కేసీఆర్‌తో క‌లిసి రేపు ఉద‌యం ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రికి వెళ్తారు. స్వామివారిని ద‌ర్శించుకున్న త‌ర్వాత అంద‌రూ ఖ‌మ్మం స‌భ‌కు బ‌య‌లుదేర‌తారు.

ఈ సభ నుంచి దేశానికి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారని మంత్రి హరీష్ రావు నిన్న మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ ద్వారానే ఖమ్మం రూపురేఖలు మారాయన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఖమ్మం నేలను ముద్దాడితే రెండు పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. కృష్ణ, గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారడానికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి అమోఘమన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం 157 మెడికల్‌ కళాశాలలు మంజూరు చేస్తే మన రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా 33 మెడికల్‌ కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందన్నారు. మనం మిషన్‌ భగీరథ పెడితే దేశం మొత్తం కూడా హర్‌ఘర్‌కో జల్‌ అని అన్నారని, మనం మిషన్‌ కాకతీయ పెట్టి చెరువులు బాగుచేస్తే అమృత్‌ సరోవర్‌ అని పేరు మార్చరన్నారు. మనం రైతుబంధు పెడితే పీఎం కిసాన్‌ అనే పథకం పెట్టి తెలంగాణ పథకాలన్ని కాపీ కొట్టారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు.

అలాగే మంత్రి హ‌రీశ్ రావు, ర‌వాణా శాఖ‌మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ బ‌హిరంగ స‌భా స్థ‌లిలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. 400 ఎక‌రాల్లో వాహ‌నాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు స‌భ‌లో వెయ్యు మంది వాలంటీర్లను నియామించారు.