శబరిమల భక్తులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

కేరళ : కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని శబరిమలలోని అయ్యప్ప కొండను సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది న‌వంబ‌ర్ 16 నుంచి తిరిగి శ‌బ‌రిమ‌ల యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ నేప‌థ్యంలో కేర‌ళ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శకాలను విడుదల చేసింది.

రోజుకు 25 వేల మంది భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శ‌నం చేసుకునేందుకు వీటుగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ప్రభుత్వం ఆదేశించింది. రెండు టీకాలు వేయించుకున్న‌వారు లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వ‌చ్చిన భ‌క్తుల‌కు మాత్ర‌మే ఆల‌యంలోకి అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది. ద‌ర్శ‌నం అనంత‌రం సన్నిధానంలో ఎవ‌రూ ఉండ‌కుండా తిరిగి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ‌త ఏడాది తరహాలోనే యాత్రికుల‌ను ఎరుమేలి మీదుగా అట‌వీ మార్గంలో పులిమేడు మీదుగా స‌న్నిధానానికి అనుమ‌తించ‌కూడ‌ద‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. నీల‌క్క‌ల్ నుంచి భ‌క్తులు కేర‌ళ ప్ర‌భుత్వ ఆర్టీసీ బ‌స్సుల‌ను ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్యలు ఉన్న భ‌క్తులు కోవిడ్ ప‌రీక్ష‌ల త‌రువాతే శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు రావాల‌ని ఆదేశించారు. స్మోక్ డిటెక్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం అధికారుల‌ను ఆదేశించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/