మహిళపై లైంగిక దాడి..కేరళ హైకోర్టు కీలక తీర్పు

పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరవడం అత్యాచారం కాదు.. కేరళ హైకోర్టు

కేరళ : మహిళపై అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, అత్యాచారం చేశాడ‌నే కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, శారీర‌కంగా దగ్గరయ్యాడని, ఆ త‌రువాత త‌న మాట నిలబెట్టుకోలేద‌ని.. మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడానికి, మోసపూరిత వాగ్దానం చేయడానికి చాలా తేడా ఉందని, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి దాన్ని నిలబెట్టుకోకపోవడం మోసంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. మ‌హిళ‌కు ఇష్టంలేకుండా లైంగిక చ‌ర్యకు పాల్పడితే.. ఆ చ‌ర్యను అత్యాచారంగా ప‌రిగ‌ణిస్తామ‌ని హైకోర్టు అభిప్రాయపడింది. ట్రయ‌ల్ కోర్టు విధించిన శిక్షను స‌వాలు చేస్తూ.. నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను జస్టిస్ ఎ.ముహమ్మద్ ముస్తాక్, కౌసర్ ఎడప్పగత్ ధ‌ర్మసానం విచారించింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు లైంగిక చర్య కాదనీ, ఈ చ‌ర్యను రేప్ గా ప‌రిగ‌ణించ‌లేమ‌నీ, ఇద్దరి సమ్మతితోనే లైంగిక చ‌ర్య జ‌రిగింద‌నీ వివరిస్తూ ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది.

ఇరువురు పది సంవత్సరాలకు పైగా సంబంధం కలిగి ఉన్నారని, వివాహానికి సిద్ధమయ్యే ముందు మాత్రమే లైంగిక చర్య జరిగిందని చెప్పారు. బాధితురాలితో మూడు సార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని కోర్టు అభిప్రాయ ప‌డింది. బాధితురాలిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో నిందితుడు లైంగిక చర్యకు పాల్పడ్డాడని, అతని కుటుంబం నుంచి ప్రతిఘటన కారణంగా అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడని కోర్టు వెల్లడించింది. ప్రాసిక్యూషన్ తరఫు ఇతర సాక్ష్యాధారాలు లేనప్పుడు, నిందితుడి ప్రవర్తన కేవలం వాగ్దాన ఉల్లంఘనగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/