రేపు జగిత్యాల లో సీఎం కేసీఆర్ పర్యటన..ముందస్తుగా బిజెపి నేతల అరెస్ట్

సీఎం కేసీఆర్ రేపు జగిత్యాలలో పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు బిజెపి నేతలను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని , టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు.

ఈ నేపథ్యంలో ముందస్తుగా వెల్గటూర్,ధర్మపురి,బుగ్గారం,గొల్లపల్లి,కొడిమ్యాల,పెగడపల్లి బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగిత్యాలకు చేరుకోనున్న కేసీఆర్… ముందుగా కొత్తగా నిర్మించిన జిల్లా పార్టీ కార్యలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు సీఎం కేసీఆర్‌ పయనంకానున్నారు.