ఢిల్లీ ఎయిమ్స్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ స‌తీమణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పోస్ట్ కొవిడ్ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌లో జాయిన్ చేసారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం శోభకు పలురకాల టెస్టులు నిర్వహించారు. వాటి ఫలితాలను విశ్లేషించిన డాక్టర్లు.. ఇన్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరాలని శోభకు సూచింరారు. వాస్తవానికి వైద్యపరీక్షల అనంతరం శనివారమే వారు హైదరాబాద్ తిరిరావాలని అనుకున్నా, డాక్టర్ల సూచనతో ఆస్పత్రిలో చేరక తప్పలేదు. రెండు రోజుల క్రిత‌మే మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ కి వెళ్లారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ కి చేరారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో సీఎం కేసీఆర్ కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం, ఆ వెంటనే ఆయన భార్య శోభకు కూడా వైరస్ సోకడం తెలిసిందే. అటు కూతురు కవిత, కొడుకు కేటీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. మిగతా ముగ్గురూ కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, శోభమ్మకు మాత్రం ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో చూయించినా, డాక్టర్ గులేరియాను కలవడమే ఉత్తమం అనే సలహా రావడంతో వారు ఢిల్లీ ఎయిమ్స్ వెళ్లారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సమస్య చాలా చిన్నదేనని, అబ్జర్వేషన్ తర్వాత ఎయిమ్స్ వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేస్తారని సమాచారం.