శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కేసీఆర్ ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా.. స్వామి వారి గర్భగుడి దివ్య విమానానికి బంగారు తాపడం కోసం 125 కిలోల బంగారం పట్టనుంది. దీనికోసం దాతలు సైతం భాగస్వామ్యం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తన కుటుంబం తరుఫున కేసీఆర్ కిలో 16 తులాల బంగారాన్ని ప్రకటించారు. నేడు దేవస్థానంలో ముఖ్యమంత్రి దంపతులు తమ మనవడు హిమాన్షు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందజేశారు.
పూజల అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతా రెడ్డి ఉన్నారు. అంతకు ముందు యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.