ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 180 కోట్లు విడుదల చేసిన కేసీఆర్

నిన్న బిఆర్ఎస్ సభలో చెప్పినట్లే సీఎం కేసీఆర్ ఈరోజు..ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసారు. కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ మొట్ట మొదటి భారీ బహిరంగ సభ నిన్న ఖమ్మంలో భారీ ఎత్తున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా నేతలు , ముఖ్యమంత్రులు , ప్రజలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఖమ్మం జిల్లాకు వరాల జల్లు కురిపించారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. పెద్ద తాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి అజయ్‌ వినతి మేరకు మునేరు నదిపై కొత్త బ్రిడ్జి, ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అలాగే ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు నెలరోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ఇలా ప్రకటించినట్లే కేసీఆర్ వాటిపై కసరత్తులు మొదలుపెట్టారు. ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది.