యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తోన్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పుణ్య క్షేత్రమైన యాదాద్రి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్… కొద్దీ సేపటి క్రితం యదాద్రి చేరుకొని ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత కాన్వాయ్లో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు.
అనంతరం ఆలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఉన్నారు. యదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది మరియు అధికారులు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను మధ్యాహ్నం 3:30 గంటలకు మీడియా కు తెలియజేయనున్నారు. ఈరోజుసాయంత్రం వరకు యదాద్రిలోనే కేసీఆర్ ఉండే అవకాశాలు ఉన్నాయి.