20న మునుగోడులో టిఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌

ఈనెల 20న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుండడం తో అన్ని పార్టీ లు ఉప ఎన్నికపై కసరత్తులు మొదలుపెడుతున్నాయి. బిజెపి నుండి రాజగోపాల్ బరిలోకి దిగుతుండడం తో విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తుంది బిజెపి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు ఫై ధీమాగా ఉన్నారు. ఈ తరుణలో టిఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది.

గురువారం సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌పై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తో కేసీఆర్ చర్చించారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలో దింపితే గెలుస్తారు..? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి..? అనే వివరాలపైనా ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి కష్టపడి పని చేయాలని, తప్పనిసరిగా మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలని నాయకులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఈ నెల 20 న మునుగోడు లో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేసారు. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్ర‌జా దీవెన స‌భ కోసం మునుగోడులో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌లిసి స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్వార్థం కోస‌మే రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశార‌ని తెలిపారు. ఆత్మ‌గౌర‌వాన్ని బీజేపీ వ‌ద్ద తాక‌ట్టుపెట్టిన నీచుడు రాజ‌గోపాల్ రెడ్డి అని ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ వైఖ‌రి దొంగే దొంగా అన్న‌ట్లుగా ఉంద‌న్నారు. ఎనిమిదేళ్లుగా ప్రజ‌ల‌కిచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మునుగోడు అభివృద్ధి చెందిందని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నో కుట్రలు చేసింది,ఇంకా చేస్తూనే ఉందని తెలిపారు. దేశ ద్రోహానికి పాల్పడుతున్న బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామ‌ని తెలిపారు.

మరోవైపు ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ సభ కంటే ముందే టిఆర్ఎస్ సభ ఏర్పాటు చేస్తుండడం తో సర్వత్రా చర్చ గా మారింది.