కెసిఆర్ నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారుః కేఏ పాల్

వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ను ప్రజలు ఓడిస్తారన్న పాల్

KA Paul

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని… వారు తనను ఎందుకు కలిశారనే విషయం ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి)న తెలుస్తుందని చెప్పారు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలో 15 శాతం వరకు నిజాయతీపరులు, నైతికత కలిగిన వారు ఉన్నారని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ను ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో బడుగు, బలహీనవర్గాల చేతుల్లోనే అధికారం ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన ఫోన్ ను కెసిఆర్ ట్యాప్ చేయిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. తాను కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులతో మాట్లాడటంపై నిఘా ఉంచారని విమర్శించారు. తెలంగాణలో తానే సీఎం కావాలని 70 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇదే సమయంలో ప్రధాని మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. మోడీ, అదానీ ఇద్దరూ కలిసి దేశం పరువు తీస్తున్నారని విమర్శించారు.