ములుగు అటవీ అధికారులపై కేసీఆర్ ఆగ్రహం

గోదావరి పరీవాహక ప్రాంతాలలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ముందుగా భద్రాచలం లో పర్యటించిన కేసీఆర్..ఆ తర్వాత హెలికాఫ్టర్ ద్వారా ఏటూరునాగారం ఏరియల్ సర్వే చేసారు. అనంతరం మాట్లాడుతూ..అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ములుగు డీఎఫ్ఓ ప్రదీప్ కుమార్ శెట్టిని మందలించారు. అటవీ శాఖలో దొంగలు తయారయ్యారన్న కేసీఆర్.. ములుగు ప్రాంతంలో ఒక్క చెట్టయినా ఉందా..? అని ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి పనులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. అటవీ ప్రాంతంలో రోడ్డు వేయనీయం, వంతెన కట్టనీయం.. కరెంట్ స్తంభాలు వేయనీయం.. అన్నట్టుగా అటవీ శాఖ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు.

శాపల్లి వంతెన నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో.. రేషన్ ఇవ్వలేకపోతున్నామని.. కలెక్టర్, ప్రజలు చావాలా..? అని డీఎఫ్ఓను కేసీఆర్ నిలదీశారు. వెరీ సారీ.. మంచి పద్ధతి కాదంటూ అటవీ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు ఏటూరునాగారం, రామన్నగూడెం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఈసందర్భంగా ఓ గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. రామన్నగూడెం లో ఏటా వరదలు వస్తున్నాయని, వచ్చే ఏడాది వరద సమస్య లేకుండా చూస్తానన్నారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ ముంపు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు వివరించారు.