రైల్వే ప్రయాణికులు గమనించగలరు : కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే పలు రైళ్లు రద్దు

కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేయగా , మరికొన్నింటిని దారి మళ్లీ ఇస్తున్నారు. రద్దైన రైళ్ల వివరాలు , అలాగే దారి మళ్లింపు రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (12758), కాజీపేట-సిర్పూర్ టౌన్ (17003), బల్లార్ష-సిర్పూర్ టౌన్ (17004) రైళ్లను రేపటి నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు 24 రోజులపాటు రద్దు చేసారు.

అలాగే, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17001), సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ (17002) రైళ్లను జులై 10, 13, 20 తేదీల్లో రద్దు చేసినట్టు పేర్కొంది. వీటితో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. భద్రాచలం రోడ్-బల్లార్ష (17003) రైలు వరంగల్-బల్లార్ష మధ్య రేపటి నుంచి జులై 20 వరకు రద్దు చేశారు. సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్ (17034) రైలును రేపటి నుంచి వచ్చే నెల 20 వరకు సిర్పూర్ టౌన్-వరంగల్ మధ్య రద్దు చేయగా, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) రైలును నేటి నుంచి జులై 19 వరకు కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రద్దు చేశారు.

సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17234) రైలును రేపటి నుంచి జులై 29 వరకు సిర్పూర్ కాగజ్‌నగర్-కాజీపేట మధ్య రద్దు చేశారు. అలాగే, తిరుపతి-జమ్ముతావి (22705) రైలును జులై 5, 12, 19వ తేదీల్లో సికింద్రాబాద్, నిజామాబాద్, ముద్కేడ్, పింపల్‌కుట్టి మీదుగా, సికింద్రాబాద్-దానాపూర్ (12791), దానాపూర్-సికింద్రాబాద్ (12792) రైళ్లను జూన్ 26 నుంచి జులై 19 వరకు పెద్దపల్లి-నిజామాబాద్-సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.