తెలంగాణ జాగృతిని దేశస్థాయికి విస్తరించేందుకు కవిత సిద్ధం..

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోకీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతిని దేశస్థాయికి విస్తరించేందుకు సిద్ధం కాబోతున్నారు. రీసెంట్ గా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ని విస్తరింపచేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ జాగృతిని దేశస్ధాయికి తీసుకెళ్లేందుకు భారత్ జాగృతి అనే కొత్త సంస్థను కవిత ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే భారత్ జాగృతి పేరు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. భారత్ జాగృతి పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కవిత హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్వరలో జాగృతి సంస్ధను దేశ స్థాయికి తీసుకెళ్తున్నామని, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి పని చేయాల్సి ఉంటుందని నేతలకు సూచించారు. తెలంగాణలో బతుకమ్మ తరహాలో ఏపీలో అట్ల తద్దె, బిహార్‌లో ఛత్‌పూజ లాంటివి ఉన్నాయని, అన్ని సంస్కృతులను గౌరవిస్తామని కవిత స్పష్టం చేశారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరిస్తామని, అక్కడి ప్రజలకు తాము వ్యతిరేకం కాదన్నారు. కేవలం ఏపీ రాజకీయ నేతలను మాత్రమే ప్రశ్నిస్తున్నామని, ప్రజలను కాదని కవిత తెలిపారు. ఏపీలో కూడా అవసరమైతే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత తెలిపారు.

తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగను నిర్వహించి దేశస్ధాయిలో అందరికీ తెలిసేలా చేశారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందరికీ తెలియజేయడంలో తెలంగాణ జాగృతి సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా భారత్ జాగృతి సక్సెస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు.