కార్వీకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు (ksbl) మంగళవారం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమ గ్రూప్ కంపెనీల వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు (sfio) అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కార్వీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కంపెనీల చట్టం ప్రకారం దర్యాఫ్తు జరిపించే అధికారం కేంద్రానికి ఉందని న్యాయస్థానం తెలిపింది sfio కు దర్యాఫ్తును అప్పగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ksbl హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టి, కొట్టి వేసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రం దర్యాఫ్తు చేయాలని చూస్తోందని కార్వీ లాయర్ కోర్టుకు విన్నవించారు. కాబట్టి దీనిని నిలిపివేయాలని కోరారు. కంపెనీల చట్టం సెక్షన్ 212 ప్రకారం కేంద్రానికి అధికారం ఉందని కేంద్రం తరపున సహాయ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. కార్వీ సహా తొమ్మిది కంపెనీలపై ఫిబ్రవరి 24న కేంద్రానికి నివేదిక పంపారని, ఈ కంపెనీలపై దర్యాఫ్తు జరపాల్సిన అవసరముందన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/