కర్ణాటకలో 93 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాః జేడీ(ఎస్)

బెంగళూరు: కర్ణాటకలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వాడి కూడా రెట్టింపయ్యింది. పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా షురూ అయ్యాయి. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నేతలు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఈసారి అధికారం చేపట్టబోయేది జేడీఎస్సేనని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెబుతున్నారు. ఈసారి కర్ణాటక ప్రజలు తమకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే, ఇంకా అసెంబ్లీ ఎన్నికల సమయం రాకపోయినా, ఎన్నికల షెడ్యూల్ రావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉన్నా.. కుమారస్వామి మాత్రం అప్పుడే కదనరంగంలో కాలుమోపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున బరిలో దిగబోయే 93 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/