జయలలిత సమాధి వద్ద నివాళ్లు అర్పించిన కంగనా

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే తలైవి సినిమా టీజర్,ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక ఈ సినిమాకు సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు కంగనా రనౌత్ చెన్నై మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధి వద్దకు వెళ్లి ఆమెకు నివాళ్లు అర్పించారు. తలైవి సినిమా అందరికీ చేరువయ్యేలా చూడాలని ఆమె కోరుకున్నారు.

అనంతరం ఎంజీఆర్ సమాధి వద్దకూ వెళ్లి నివాళులర్పించారు. ఇకనుంచి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండనున్నట్టు చెప్పారు. విద్యార్థి దశ నుంచి సినిమాల్లో హీరోయిన్ గా, రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత జీవిత చరిత్ర మొత్తాన్ని సినిమాలో చూపించనున్నారు. ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఎంజీఆర్ తో పరిచయం వంటి వాటినీ సినిమాలో ఆవిష్కరించనున్నారు. ఎ.ఎల్. విజయ్ డైరెక్టర్ కాగా.. ఎంజీఆర్ గా అరవిందస్వామి నటించారు.