యూనివర్శిటీ పేరును మార్చడం బాధను కలిగిస్తుంది – కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై నందమూరి కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీని స్థాపించారని పేర్కొన్నారు. ఏపీలోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్ గారు ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారన్నారు. ఈ హెల్త్ యూనివర్సిటీ దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెంది, లెక్కలేనంత మంది హెల్త్ నిపుణులను దేశానికి అందించిందని గుర్తు చేసారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు ఈ యూనివర్సిటీ కి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చారని తెలిపారు.

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం తనకు బాధ కలిగించిందని కల్యాణ్ రామ్ అన్నారు. కేవలం రాజకీయ లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని పేర్కొన్నారు. అంతకు ముందు జూ. ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ ద్వారా ఈ పేరు మార్పు ఫై స్పదించారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైయస్సార్ పేరు పెడితే… ఆయన గౌరవం పెరగదని చురకాల అంటించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదన్నారు ఎన్టీఆర్. యూనివర్సిటీ కి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదని ట్వీట్ చేశారు. నిన్న బుధువారం ఎన్టీఆర్ ఫ్యామిలీ తరుపున రామకృష్ణ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం జరిగింది.