నగరవాసులకు గుడ్ న్యూస్ ..రేపు కైత్లాపూర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. రేపు కేటీఆర్ చేతుల మీదుగా కైత్లాపూర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైత్లాపూర్‌ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ. 83కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది. జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి రాకతో కూకట్‌పల్లి, బాలానగర్‌, ఫతేనగర్‌, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ మార్గంలో సులభంగా హైటెక సిటీకి చేరుకోనున్నారు. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌ హైటెక సిటీ మార్గంలోని ఫ్లై ఓవర్‌, అండర్‌పాస్‌ బ్రిడ్జిలపై ట్రాఫిక ఒత్తిడి తగ్గుతుంది. కైత్లాపూర్‌ ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.83.06కోట్లు ఖర్చు చేసింది. రైల్వే పనులకు రూ. 18.06కోట్లు, భూ సేకరణకు రూ.25కోట్లు, నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ. 40కోట్లు వెచ్చించింది.

675.50 మీటర్ల పొడవులో ఆర్వోబీ చేపట్టింది. 46 మీటర్ల మేర రైల్వే స్పాన్‌, 16.61 విూటర్లలో నాలుగు లేన్ల బైడైరెక్షన్లలో నిర్మాణం జరిగింది. 5.50 విూటర్లలో సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా ప్రస్తుతం ఉన్న జేఎన్‌టీయూ, హైటెక సిటీ బ్రిడ్జిలపై వాహనాల రద్దీ తగ్గుతుంది. సనత్‌నగర్‌, బాలానగర్‌, మూసాపేట ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా హైటెక్ సిటీ కి సులువుగా చేరుకోవచ్చు. కైత్లాపూర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సైబ‌రాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ కోరారు.

ఎర్రగడ్డ నుంచి హైటెక్‌ సిటీకి వయా మూసాపేట్‌ మీద వచ్చే వాహనాలను మూసాపేట్‌ జంక్షన్ – వైజంక్షన్ – కూకట్‌పల్లి – రోడ్డు నెం.1- కేపీహెచ్‌బీ – జేఎన్‌టీయూ – హైటెక్‌ సిటీ మీదుగా మళ్ళిస్తారు. -బాలానగర్‌ నుంచి వై-జంక్షన్‌ వయా హైటెక్‌ సిటీ వెళ్ళే వాహనాలను ఐడీఎల్‌ ట్యాంక్‌ నుంచి – కూకట్‌పల్లి – రోడ్డు నెం.1 – కేపీహెచ్‌బీ – జేఎన్‌టీయూ – హైటెక్‌ సిటీ వైపు పంపిస్తారు.
-హఫీజ్‌పేట్‌, ఆర్‌యూబీ వైపు నుంచి కైత్లాపూర్‌కు వచ్చే వాహనాలను ఆర్‌యూబీ – జేఎన్‌టీయూ వైపు మళ్లించనున్నారు.