ప్రారంభమైన కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర

ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన రథం

kaikala-satyanarayana-final-yatra

హైదరాబాద్‌ః సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈరోజు(శనివారం) ఉదయం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. కైకాల సత్యనారాయణ పార్థివదేహంతో అంతిమయాత్ర మొదలైంది. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం నుంచి నేరుగా మహాప్రస్థానానికి కైకాల పార్థివ దేహాన్ని తీసుకెళుతున్నారు. పూలరథంలో కైకాలను సాగనంపుతున్నారు.

కైకాల పార్థివ దేహాన్ని తీసుకెళుతున్న పూలరథం వెంబడి ఆయన అభిమానులు వాహనాలతో అనుసరిస్తున్నారు. ఇప్పటికే మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కైకాల.. శుక్రవారం మరణించారని తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నటులు చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా పలువురు రాజకీయ నేతలు కైకాల పార్థివదేహానికి శుక్రవారం నివాళులు అర్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/