అమెరికా నుండి హైదరాబాద్ కు చేరుకున్న జూ.ఎన్టీఆర్

జూ. ఎన్టీఆర్ అమెరికా నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఎన్టీఆర్ కు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న జెండాలు పట్టుకుని జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడాడు.

“తమకు ఈ స్థాయిని కల్పించిన అభిమానులకు, ప్రేక్షకులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఆస్కార్‌ వేదికపై నాటు నాటు పెర్ఫార్మెన్స్‌ ని లైఫ్ లో మరిచిపోలేను. ఆస్కార్‌ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది. రాజమౌళి చేతిలో ఆస్కార్‌ చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.. నాటు నాటు పాటకు అవార్డ్ అనౌన్స్‌ చేసినప్పుడు సంతోషాన్ని పట్టలేకపోయాం. స్టేజ్ పై కీరవాణి గారు, చంద్రబోస్ అవార్డులు అందుకున్నప్పుడు.. అది నా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్. అయితే.. అవార్డు విషయాన్నీ ముందుగా నా భార్యతో షేర్ చేసుకున్నాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాకు సిద్ధమౌవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టనుంది.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ ఆస్కార్ వేడుకలలో రాజమౌళి దంపతులతో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కూడా సందడి చేశారు. ఇక ఎన్టీఆర్ ఇండియా రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.