2024 జూన్ వరకు నడ్డా పదవీకాలం కొనసాగింపు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించింది అధిష్టానం. ఈరోజు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం చేసారు. ఈ నెల 20న నడ్డా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అత్యంత ముఖ్యమైన లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని నడ్డాను కొనసాగించాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ… నడ్డా అధ్యక్షతన 2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నడ్డా నాయకత్వంలో మంచి విజయాలను సాధించామని… తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమయిందని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు.