నితిన్ తో జేపీ నడ్డా సమావేశం..

బిజెపి అధిష్టానం ఫోకస్ అంత తెలంగాణ పైనే పెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. కేవలం రాజకీయ నేతలనే కాదు సినీ నటులను కూడా వదిలిపెట్టడం లేదు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ రాజకీయంగా కాదని, కేవలం ఆర్ఆర్ఆర్ చూసి ఎన్టీఆర్ నటన కు ఫిదా అయ్యారని, నటన పరంగా ప్రశంసలు తెలిపేందుకు అమిత్ షా భేటీ అయ్యారని బిజెపి నేతలు తెలిపారు. ఇక ఇప్పుడు హీరో నితిన్ తో జెపి నడ్డా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది. రేపు సాయంత్రం శంషాబాద్ నోవాటెల్ లో కలిసేందుకు ముహూర్తం నిర్ణయించారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్ కెరియర్ లో అనేక సక్సెస్ సినిమాలు ఉన్నాయి. వరుసగా సినిమా హీరోలకు దగ్గరవ్వటం ద్వారా వారి అభిమానుల ఓట్ బ్యాంక్ పైన బీజేపీ గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతానికే చెందిన హీరో కావటంతో ఈ భేటీ ఆసక్తి కరంగా మారుతోంది. రానున్న రోజుల్లోనూ పలువురు హీరోలతో పాటుగా ప్రముఖులతో..పార్టీ ముఖ్య నేతల భేటీలు కొనసాగతాయని బీజేపీ తెలంగాణ నేతలు చెబుతున్నారు. సినీ రంగంతో పాటుగా ప్రస్తుతం క్రీడా రంగానికి చెందిన ప్రముఖలతో సమావేశాల పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా నడ్డాతో కలవనున్నారు. మరి కొందరు క్రీడా ప్రముఖులు.. రచయితలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇతర రంగాల్లో పేరు సంపాదించిన వారితోనూ భేటీలు ఉంటాయని తెలుస్తోంది.అయితే, బీజేపీలోకి నడ్డా స్వయంగా నితిన్ ను ఆహ్వానిస్తే..యువ హీరో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చూడాలి.