క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ అరుదైన రికార్డు
జోహన్నస్ బర్గ్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. సంప్రదాయక ఫార్మాట్లో 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో జోరూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఈ ఘనతనందుకుంది. ఇది ఇంగ్లండ్కు 1022వ టెస్ట్ మ్యాచ్ కాగా.. శుక్రవారం తొలి రోజు జోరూట్ సింగిల్తో ఈ 5 లక్షల మార్క్ను అందుకుంది. ఇక ఇంగ్లండ్ తర్వాత ఆస్ట్రేలియా 830 టెస్టుల్లో నాలుగు లక్షల 32 వేల 706 పరుగులతో రెండో స్థానంలో ఉండగా భారత్, వెస్డిండీస్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 540 టెస్ట్లు ఆడిన భారత్ 2,73,518 పరుగులు చేసింది. ఇక వెస్టిండీస్ 545 టెస్ట్ల్లో 2,40,441 పరుగులు చేసింది. అంతేకాకుండా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్తో ఇంగ్లండ్ విదేశీ గడ్డపై 500 మ్యాచ్లు ఆడిన జట్టుగా చరిత్రకెక్కింది. ఈ జాబితాలో 404 మ్యాచ్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా.. 268 టెస్ట్లతో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక వీటిలో 51 గెలిచిన ఇండియా.. 113 ఓడి 104 మ్యాచ్లను డ్రా చేసుకుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/