పవన్‌ కళ్యాణ్ ను నమ్మితే జనసేన పార్టీ శ్రేణులు నట్టేట మునగడం ఖాయం – జోగి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నమ్మితే జనసేన పార్టీ శ్రేణులు నట్టేట మునగడం ఖాయమని అన్నారు మంత్రి జోగి రమేష్. పవన్ కళ్యాణ్ ఆదివారం సత్తెనపల్లి లో ఏర్పటు చేసిన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓడిపోతుందని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లో జగన్ విఫలమయ్యాడని , ప్రతి ఒక్క నేత అడ్డగోలుగా ప్రజలను దోచుకుంటున్నారని , యువతను పట్టించుకోవడం లేదని , ఉద్యోగాలు కల్పించలేకపోతుందని విమర్శించారు. ఇదే సభలో పలువురు వైస్సార్సీపీ నేతలు జనసేన పార్టీలోకి చేరారు.

ఈ క్రమంలో వైస్సార్సీపీ మంత్రి జోగి రమేష్ ..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్‌ కల్యాణ్‌ను నమ్మితే జనసేన పార్టీ శ్రేణులు నట్టేట మునగడం ఖాయమన్నారు. జెండా, అజెండా, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్, ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. పవన్‌ కల్యాణ్‌ విజిటింగ్‌ వీసా మీద వచ్చి నోటికొచ్చినట్టుగా వాగిపోయాడన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే దమ్మూ, ధైర్యం జనసేన పార్టీకి ఉందా..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చెంచాగిరీ చేయడం ఒక్కటే పవన్‌కు బాగా తెలుసన్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడి, రెచ్చగొట్టి, హింసను ప్రేరేపిస్తున్నాడ‌న్నారు. ప‌వ‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమీ లేదన్నారు.