ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లనున్న అధ్యక్షుడు జో బైడెన్

పోలెండ్ లోని ర్జెసుఫ్ పట్టణానికి బైడెన్

వాషింగ్టన్: యుద్ధంతో అట్డుడుకిపోతున్న ఉక్రెయిన్ సరిహద్దులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెళ్లనున్నారు. పోలెండ్–ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ఓ పట్టణంలో ఆయన పర్యటించనున్నారు. అది కూడా ఈ రోజే వెళ్లనున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో తొలిసారి ఆయన.. ఉక్రెయిన్ సరిహద్దు పట్టణం వరకు వెళ్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పోలెండ్ తూర్పు ప్రాంతంలోని ర్జెసుఫ్ కు ఎయిర్ ఫోర్స్ వన్ లో ఆయన బయల్దేరి వెళ్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. నాటో బలగాలకు నైతిక స్థైర్యాన్నివ్వడంలో భాగంగానే ఆయన ఉక్రెయిన్ సరిహద్దులకు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పట్టణానికి వెళ్తున్నారని చెబుతున్నారు. నాటోలో భాగమైన అమెరికా 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ లో పరిస్థితులపై ఆయన సమీక్షించనున్నారు. మరోవైపు బైడెన్ పర్యటన నేపథ్యంలో రుమేనియా, హంగరీ, స్లొవేకియా, బల్గేరియాల్లో బలగాలను నాటో బలగాలను పెంచనుంది.

కాగా, ఇప్పటికే యుద్ధంతో కోటి మందికిపైగా వేరే చోటికి తరలివెళ్లిపోయారు. దీంతో ఆ దేశంలో తీవ్రమైన మానవ సంక్షోభం వేధిస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/