రేపు బైడెన్‌ ప్రమాణస్వీకారం..భద్రత కట్టుదిట్టం

భద్రతా సిబ్బంది నుంచే ముప్పు ఉందని సమాచారం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా రేపు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రతా సిబ్బందిలో కొందరు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం అందడంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. శ్వేతసౌధం పరిసరాలు సహా వాషింగ్టన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా సిబ్బందిని మోహరించారు. విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బంది నుంచే దాడుల ముప్పు ఉందన్న ముందస్తు హెచ్చరికలతో రక్షణశాఖ అధికారులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. బైడెన్ ప్రమాణస్వీకారం సందర్భంగా భద్రతలో పాల్గొనే సిబ్బందిలో కొందరు తిరుగుబాటు చేసి దాడులకు పాల్పడే అవకాశం ఉందని, అలాగే, ట్రంప్ మద్దతుదారులు కూడా హింసకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది.

ఇటీవల కేపిటల్ భవనంపై జరిగిన దాడిలో కొందరు పోలీసులు కూడా పాల్గొనడంతో వైట్‌హౌస్ పరిసరాల్లో పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్‌లో మోహరించారు. అలాగే, వేలాదిమంది స్థానిక పోలీసులు విధుల్లో ఉన్నారు. అయితే, విపరీత భావజాలంతో వీరిలో ఎవరైనా దాడులకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే రెండు మూడుసార్లు తనిఖీ చేయాలన్న ఆదేశాలు కూడా అందాయి. ఒక్క వాషింగ్టన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చిన్నచిన్న గుంపులుగా వచ్చి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడి చేసే అవకాశం ఉండడంతో వారిని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వేరీ తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ట్రంప్ మద్దతుదారుల ఆందోళన కొనసాగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/