దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి.. బైడెన్

అమెరికాలో ఐదు లక్షలు దాటిన కరోనా మృతులు..సంతాప సూచకంగా జాతీయ పతాకాలను కిందకు దించాలని ఆదేశం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 5 లక్షలను దాటింది. ఈ నేపథ్యంలో మృతులకు సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలపై ఉన్న జాతీయ పతాకం ఎగిరే ఎత్తును సగానికి తగ్గించాలని బైడెన్ నిర్ణయించారని, వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జెన్ ప్సాకీ మీడియాకు తెలిపారు. ఐదు రోజుల పాటు పతాక అవనతం కొనసాగుతుందని అన్నారు.

కాగా, ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కోట్లాది మందికి వ్యాక్సిన్ ను అందించారు. కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ మరణాల రేటు మాత్రం ఇంకా చెప్పుకోతగిన విధంగా దిగిరాలేదు. జాన్ హాప్కిన్స్ వర్శిటీ గణాంకాల ప్రకారం, అమెరికాలో ఇంతవరకూ కరోనా మహమ్మారి బారిన పడి 5,00,071 మంది మరణించారు. ప్రపంచంలో రెండో స్థానంలో కరోనా మరణాల సంఖ్యను కలిగున్న బ్రెజిల్ తో పోలిస్తే దాదాపు రెట్టింపు మరణాలు అమెరికాలో సంభవించడం గమనార్హం.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/