రిపోర్ట‌ర్‌ను కోప‌గించుకున్న బైడెన్‌

త‌ర్వాత‌ ఫోన్ చేసి సారీ చెప్పిన వైనం

వాషింగ్టన్ : ఓ జర్నలిస్టు‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. శ్వేత‌సౌధంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన బైడెన్‌ను ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు. దీంతో బైడెన్ ఒక్క‌సారిగా నోరుజారి తిట్టారు. మీడియా స‌మావేశం ముగిసిన వెంట‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఇత‌ర రిపోర్ట‌ర్లు ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోలేదు.

మధ్యంతర ఎన్నికల వేళ ద్రవ్యోల్బణం అంశాన్ని రాజకీయ బాధ్యతగా భావిస్తారా? అని ఆ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బైడెన్ అస‌హ‌నానికి గురై ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అన్నారు. ‘వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ బి….’ అంటూ తిట్టారు. రిప‌బ్లిక‌న్ల‌కు ఫాక్స్ ఛానల్ అనుకూలంగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వ విధానాలను పీటర్ డూసీ ఎప్పుడూ తప్పుపడుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే బైడెన్ ఆ రిపోర్టర్‌పై మండిప‌డ్డారు. అయితే, ఈ ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం ఆ రిపోర్ట‌ర్‌కు బైడెన్‌ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/