అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హత్యాయత్నం కేసులో సాయి వర్షిత్‌కు పదేళ్ల జైలుశిక్ష..?

అమెరికా అధ్యక్షుడి హత్యకు ప్లాన్ చేసిన తెలుగు సంతతి కుర్రాడు సాయి వర్షిత్‌కు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపుతానంటూ సాయి వర్షిత్‌ కందుల (19) ట్రక్కుతో వెళ్లి వైట్ హౌజ్ బారికేడ్లను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షిత్​కు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.2 కోట్ల (2,50,000 డాలర్లు) జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

బుధవారం ఫెడరల్‌ కోర్టు జడ్జి రాబిన్‌ మెరివెదర్‌ ఎదుట వర్షిత్‌ను హాజరుపరచగా, మే 30 దాకా కస్టడీకి ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుకు హాజరైన వర్షిత్‌ జడ్జి అడిగిన ప్రశ్నలకు వినయంగా, పొడిగా బదులిచ్చాడు. ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపటం, అధ్యక్షుణ్ని చంపుతానని బెదిరించటం, అనుమతి లేకుండా చొరబడటం.. ఇలా పలు అభియోగాలను వర్షిత్‌పై పోలీసులు నమోదు చేశారు.