వినియోగదారులకు గుడ్ న్యూస్ : హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. 5జీ సేవలకోసం ఎదురు చూస్తున్న వారికీ రిలయన్స్‌ జియో తీపి కబురు తెలిపింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో గురువారం నుంచే 5 జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నాద్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టయింది. ఈ పట్టణాల్లోని జియో కస్టమర్లు తమ మై జియో యాప్ లో ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 5జీ నెట్ వర్క్ కు కనెక్ట్ కావొచ్చని జియో ప్రకటించింది. 2023 దీపావళికి దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ ను చేరువ చేస్తామని జియో లోగడే ప్రకటించడం గమనార్హం.

భారతీ ఎయిర్ టెల్ సైతం హైదరాబాద్ పరిధిలో 5జీ సేవలను ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. జియో యూజర్లు 5జీ ఫోన్ కలిగి ఉంటే 5జీ నెట్ కు అనుసంధానం కావచ్చు. ఎంపిక చేసిన కస్టమర్లకు అన్ లిమిటెడ్ గా 5జీ డేటాను జియో ప్రస్తుతం ఆఫర్ చేస్తోంది. 4జీని సైతం మొదట్లో ఉచితంగా ఇచ్చి యూజర్లను ఆకర్షించడం తెలిసిందే. జియో యూజర్లకు ఎస్ఎంఎస్ లేదా మైజియో యాప్ లో నోటిఫికేషన్ రూపంలో ఇన్విటేషన్ వస్తుంది. అప్పుడే 5జీ నెట్ వర్క్ కు అనుసంధానం కాగలరు. కస్టమర్లకు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద అన్‌లిమిటెడ్‌ 5జీ డాటాను 1జీబీపీఎస్‌ వేగంతో అందిస్తున్నది. అదనంగా రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సంస్థ ఆరు నగరాల్లో లక్షకు పైగా వినియోగదారులు ఈ సేవలు పొందుతున్నారు.