ఆంధ్రను వదిలేసి తెలంగాణకు వస్తా అంటూ జేసి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏమాట్లాడిన వైరల్ కావాల్సిందే..అది సొంత పార్టీ పైనే చేసిన..అధికార పార్టీ ఫై చేసిన సరే మీడియా లో హైలైట్ గా నిలుస్తుంటాయి. తాజాగా దివాకర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి తాము చాలా నష్టపోయామని , అవకాశముంటే ఆంధ్రాని వదిలేసి తెలంగాణకు వచ్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆయన లాబీలో సందడి చేశారు. మంత్రి కేటీఆర్‌ని కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ.. తన పాత మిత్రులను కలుసుకునేందుకే అసెంబ్లీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాను సీఎం కేసీఆర్‌ను కలవాలనుకున్నానని, అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్‌ని కలిశానన్నారు.

జానారెడ్డి తనకు పాతమిత్రుడని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి.. నాగార్జున సాగర్‌లో ఆయన ఓడిపోతాడని తాను ముందే చెప్పానన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజమూ బాగోలేదని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు.