రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని షింజో అబే
ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నందువల్ల, తన అనారోగ్యం ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేయబోతున్నట్లు తెలిపింది. రోజు రోజుకూ దిగజారుతున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని షింజో అబే నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆయన గత కొన్నేళ్లుగా అల్సరేటివ్ కొలిటిస్తో బాధపడుతున్నారని తెలిపింది. తన సమస్యను ప్రజలకు వివరించేందుకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో షింజో అబే తన రాజీనామాకు గల కారణాలను వివరించనున్నారు. జపాన్ అధికార పార్టీ వర్గాలు మాత్రం షింజో అబే ఆరోగ్యం బాగుందని చెప్తున్నాయి. ఆయన పదవీ కాలం 2021 సెప్టెంబరుతో ముగుస్తుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/