పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూపాదయాత్ర చేపట్టిన జనసేన నేత
అమరావతిః జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పాదయాత్ర చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వరంలో పాదగయ క్షేత్రం నుంచి తొలి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. నిరుపేదలకు మంచి జరగాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. పవన్ కళ్యాణ్ లాంటి సమర్ధుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే జరుగుతాయని శ్రీధర్ అన్నారు. ‘పవన్ రావాలి పాలన మారాలి’ అనే నినాదంతో ఈ పాదయాత్రను చేపట్టారు.
2024లో పవన్ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ పిల్లా దీపిక దంపతులు జనసేన మహిళా కార్యకర్తలతో కలిసి పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదగయ క్షేత్రం నుంచి భారీ ర్యాలీగా పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర పిఠాపురం పట్టణం కుమారపురం, కందరాడ, ఎఫ్కే పాలెం మీదుగా సాగింది. దారిపొడవునా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనే నినాదాలతో యాత్ర కొనసాగింది. దారి పొడవునా డాక్టర్ పిల్లా శ్రీధర్కు, పిల్లా దీపికకు మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జన సేన కార్యకర్తలు, మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు జన బలంతో పాటు దైవ బలం కూడా తోడు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టామ’ని చెప్పుకొచ్చారు.