ఇది ముమ్మాటికీ క్రిమినల్ చర్యే : నాదెండ్ల మనోహర్
పిఠాపురంలో మహిళలు లోపలుండగానే ఇంటికి తాళం
ఘటనపై ఘాటుగా స్పందించిన జనసేన
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలో పన్నుల కోసం వెళ్లిన అధికారులు.. ఇంట్లో మహిళలు ఉండగానే ఆ ఇంటికి తాళం వేసిన ఘటన పై జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. పన్నుల పేరిట డబ్బు కోసం జగన్ ప్రభుత్వం జనాన్ని పీడిస్తోందని జనసేన పార్టీ ఆరోపించింది. ఖజానాను నింపుకోవడానికి పన్నుల పేరిట ప్రజలను పీడించడంతో పాటుగా వేధిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓటీఎస్ పేరుతో ప్రజల ముక్కుపిండి మరీ వందల కోట్ల మేర నిధులను లాగేశారని ఆయన ఆరోపించారు. పన్నుల కోసం ప్రజల ఇళ్లకు వెళుతున్న అధికారులు.. అక్కడ పన్నుల వసూళ్ల పేరిట సాగిస్తున్న అరాచకాలను నాదెండ్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలో పన్నుల కోసం వెళ్లిన అధికారులు.. ఇంట్లో మహిళలు ఉండగానే ఆ ఇంటికి తాళం వేశారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య అక్రమ గృహ నిర్బంధం కిందకే వస్తుందన్న ఆయన.. ఇది ముమ్మాటికీ క్రిమినల్ చర్యేనని ఆయన పేర్కొన్నారు. అధికారులు సాగిస్తున్న ఈ తరహా దుశ్చర్యలను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా చర్యలతో సీఎం జగన్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. ఈ తరహా చర్యలను తమ పార్టీ ఖండిస్తోందని నాదెండ్ల తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/