కన్నీరు పెట్టుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. ఓ భూవివాదంలో సొంత కూతురే తనపై కేసు పెట్టడంతో తీవ్ర వేదనకు గురయ్యారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని , ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని కూతురు తుల్జా భవాని రెడ్డి తన తండ్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అయితే.. గతంలో ఈ భూమిపై తీవ్ర వివాదం చెలరేగింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆయన సొంత కూతురే ఫిర్యాదు చేయడంతో సర్వత్రా చర్చగా మారింది. కుమార్తె ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమార్తెకు ఇచ్చిన ఆస్తి ఆమె పేరు మీదే ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే పొడిగించామని ముత్తిరెడ్డి వివరించారు. అన్ని కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయని తెలిపారు. తన కుటుంబ వ్యవహారాన్ని రాజకీయ, ప్రజా జీవితానికి ఆపాదించడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓ పావుగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి విమర్శించారు.