జామియా విద్యార్థులను చితకబాదిన పోలీసులు
సీఏఏపై వ్యతిరేకంగా నిరసనలు తెలిపినందుకే!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మీలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను జామియా కో ఆర్డినేషన్ కమిటీ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆ వర్సిటీలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరులో వర్సిటీ పాత రీడింగ్ హాల్ లో విద్యార్థులు ఉండగా అందులోకి దూసుకు వచ్చిన పోలీసులు విద్యార్థులపై లాఠీలు ఝుళిపించారు. అందులో ఉన్న ప్రతి విద్యార్థినీ విచక్షణారహితంగా కొట్టారు. కొందరు భయపడి దాక్కున్నప్పటికీ వారిని వదలలేదు. జామియా కో ఆర్డినేషన్ కమిటీ విడుదల చేసిన ఈ వీడియోను చూస్తోన్న నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఓల్డ్ రీడింగ్ హాల్లో పోలీసులు పాల్పడిన దౌర్జన్యానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్’ అంటూ జామియా కో ఆర్డినేషన్ కమిటీ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/