మేము మంచి పొరుగు సంబంధాలను కోరుకుంటున్నాము..దాని అర్థం ఉగ్రవాదాన్ని క్షమించడం కాదుః జై శంకర్

పాకిస్థాన్, చైనాకు కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ హెచ్చరిక

s jaishankar
s jaishankar

న్యూఢిల్లీః భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో చైనాకు కూడా ఘాటైన సందేశాన్ని పంపారు. ప్రధాన అంశాల్లో రాజీపడబోమని, ఉగ్రవాదంతో భారత్‌ అంతగా ఏ దేశం బాధపడలేదని మంత్రి అన్నారు. సైప్రస్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సాధారణీకరించబోమని, హేతుబద్ధీకరించబోమని చాలా స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు. పాకిస్థాన్ పేరు నేరుగా ప్రస్తావించకుండా విదేశాంగ మంత్రి ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. ‘మేము ఉగ్రవాదాన్ని చర్చల వేదిక వద్దకు తీసుకువచ్చే అవసరం కల్పించడాన్ని ఎప్పటికీ అనుమతించము. మేము ప్రతి ఒక్కరితో మంచి పొరుగు సంబంధాలను కోరుకుంటున్నాము, కానీ దాని అర్థం ఉగ్రవాదాన్ని క్షమించడమో, పట్టించుకోకపోడమో, లేదా దాన్ని హేతుబద్ధం చేయడమో కాదు’ అని స్పష్టం చేశారు.

చైనాతో సరిహద్దు సమస్యలపై జై శంకర్ స్పందించారు. కోవిడ్ సమయంలో సవాళ్లు తీవ్రమయ్యాయని, చైనాతో సంబంధాలు సాధారణమైనవి కావన్నారు. ఈ మధ్య అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా, భారత దళాలు ఘర్షణ పడ్డాయి. ‘కోవిడ్ సమయంలో మా సరిహద్దుల్లో మాకు సవాళ్లు ఉన్నాయి. చైనాతో సంబంధాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఎల్ ఏసీని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నానికి మేము అంగీకరించము’అని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) వెంబడి భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు, 2020 తర్వాత ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన మొదటి సరిహద్దు ఘర్షణ ఇది. చైనీయులు ఆ ప్రాంతంలోని భారత పోస్ట్‌ను నిర్మూలించాలని కోరుకున్నారు, దీనిని భారత సైనికులు విజయవంతంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువైపులా స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/