భారత్లో 73 కరోనా కేసులు..అనవసర ప్రయాణాలోద్దు
లోక్సభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన

న్యూఢిల్లీ: కరోన వైరస్ (కొవిడ్-19) కేసులు భారత్లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో గురువారం లోక్సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఈవైరస్పై కీలక ప్రకటన చేశారు. ‘ఇది ఆందోళనకర విషయం. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారు 73 మంది ఉన్నారు. అసాధారణ పరిస్థితులను అరికట్టడానికి అసాధారణంగానే స్పందన ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి’ అని సూచించారు. కాగా దేశంలోని కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 56 మంది దేశీయులే ఉన్నారు. భారత్లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 10,57, 506 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కరోనాపై జయశంకర్ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు దేశంలో మొత్తం 73 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది. ఢిల్లీలో 6, హర్యానాలో 14, కేరళలో 17, రాజస్థాన్లో 3, తెలంగాణలో 1, ఉత్తరప్రదేశ్లో 10, లడఖ్లో 3, తమిళనాడులో 1, జమ్మూకశ్మీర్లో 1, పంజాబ్లో 1, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/