ఎస్‌సీవో విందులో కీలక ఉదంతం.. పాక్‌ మంత్రితో జయశంకర్‌ షేక్‌హ్యాండ్‌

jaishankar-and-pakistan’s-bilawal-bhutto-shook-hands-at-goa-sco-dinner-says-sources

పనాజీః గోవాలోని బెనాలిం గ్రామంలో శుక్రవారం జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) దేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కీలక ఉదంతం జరిగింది. ఈ మీటింగ్‌కి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావ‌ల్ భుట్టో కూడా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మీటింగ్‌కు హాజరైన ప్రతినిధుల కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్‌ మంత్రి భుట్టోకు.. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మర్యాదపూర్వకంగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నట్లు సమావేశానికి హాజరైన వారు వెల్లడించారు. ఎస్‌ఈవో సమావేశంలో భారత్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని పాక్‌ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌, పాక్‌ మంత్రులు షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆసక్తికరంగా మారింది.