రాహుల్ జోడో యాత్ర – బూస్టర్ డోస్ : జైరాం రమేష్

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర..తెలంగాణ లో కాంగ్రెస్ కు బూస్టర్ డోస్ లాంటిదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ . అందోల్ మండలం దానంపల్లి వద్ద జైరాం రమేష్ మీడియా తో మాట్లాడారు. రాష్ట్రం లో జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఏడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తైందని తెలిపారు. ఉన్నతమైన లక్ష్యం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారని చెప్పారు. ఈ యాత్ర ఎన్నికల కోసం మాత్రం కాదన్నారు.

రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త దిశా నిర్దేశం చేస్తుందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే వందలమంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ పాదయాత్ర ద్వారా తమకు తెలిసిందన్నారు.