వచ్చే ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు పెడదామంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి హాట్ టాపిక్ అయ్యారు. వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్లు ఖర్చు పెడతామని , టిఆర్ఎస్ , బిజెపి ని ఓడిస్తామని .. కేసీఆర్‌తో దాడోపేడో తేల్చుకుందామని, బీజేపీని అణగదొక్కుకుంటూ ముందుకు సాగుతామంటూ వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ఫై జగ్గారెడ్డి స్పందించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా , బిజెపి రెండో స్థానానికి పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో ఇక కాంగ్రెస్ పని ముగిసినట్లే అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో ఈ ఫలితాలపై జగ్గారెడ్డి స్పందించారు.

మునుగోడులో గెలవకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాన్ని చూపిద్దామంటూ శ్రేణులకు సూచించారు. మేము రూ.100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే మునుగోడులో ఫస్ట్ ప్లేస్.. రూ.50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే రెండో స్థానం దక్కించుకునేవాళ్లం.. డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టే మునుగోడులో మూడో స్థానం దక్కించుకున్నాం.. ఉపఎన్నికలో ఓడిపోయినందుకు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము కూడా పైసలు ఖర్చు పెడతాం.. మా పార్టీలో కూడా బలమైన నాయకులు ఉన్నారు.. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే డబ్బులు సమకూర్చుకుంటాం.. వచ్చే ఎన్నికల్లో మా సత్తాను ధనబలం రూపంలో కూడా చూపిస్తాం.. టీఆర్ఎస్, బీజేపీ వాళ్లు ఎంత ఖర్చు పెడతారో మేము కూడా అంతే ఖర్చు పెడతాం.. అన్ని పార్టీలలో నేతల మధ్య లుకలుకలు ఉంటాయి.. ఆ పార్టీలలో బయటకు మాట్లాడితే బయటకు గెంటేస్తారు.. మా పార్టీలో దమ్ము ఉంది కాబట్టే మాట్లాడతాము.. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటుంది అని జగ్గారెడ్డి అన్నారు.

కేసీఆర్‌కు భయపడి పోలీసులు డ్యూటీ చేయవద్దని, కాంగ్రెస్ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టవద్దని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబం పోలీసులు లేకుండా బయట తిరగలేకపోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యక్తలను పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.