రేపు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం..
ఇళ్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్..జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని తీసుకొచ్చారు. రేపు ఈ పథకాన్ని సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రారంభించనున్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం నగదు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో భాగంగానే… రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు తణుకు చేరుకోనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. అనంతరం… జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఈ పథకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరిగింది. పేదలు ఎవరూ ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించొద్దని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగానే ఇంటి పట్టాలు అందజేస్తామంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనిపై టీడీపీ, టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు కూడా పెడుతున్న నేపథ్యంలో.. నేరుగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.