రేపు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
రేపు బెజవాడ కనకదుర్గమ్మకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మూలానక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) రోజున దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వైయస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.
అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సెక్యూరిటీ ట్రయల్ రన్ చేపట్టారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని దేవస్థానం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అర్ధరాత్రి నుంచే క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కొండపైకి వాహనాలు అనుమతించబోమిన, రేపు అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలేనని అధికారులు వెల్లడించారు.