గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష చేయబోతున్నారు
వైస్సార్సీపీ సర్కార్ గడప గడపకు కార్యక్రమం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల సమస్య లు నేరుగా తెలుసుకునేలా ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. పార్టీ నేతలంతా కూడా గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ..ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ఫై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు.
కార్యక్రమంపై ఎల్లుండి(బుధవారం) సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న వర్క్షాప్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇప్పటిదాకా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇప్పటికే జగన్ చెంతకు చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గడపగడపకు మన ప్రభుత్వంలో ఎదురైన అనుభవాలను స్వయంగా పార్టీ బాధ్యుల నుంచే జగన్ తెలుసుకోనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ బాధ్యులు చెప్పిన దానిని తనకు అందిన నివేదికతో పోల్చి చూడనున్న జగన్ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడంపై పార్టీ శ్రేణులకు దిశార్దేశం చేయనున్నట్లుగా సమాచారం.