ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ మోడీకి జగన్ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ ప్రధాని మోడీని కోరారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ప్రధానికి వినతిపత్రం అందజేశారు. సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి వీడ్కోలు పలికిన సీఎం జగన్‌.. పలు విజ్ఞప్తులతో కూడిన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. రీసోర్స్‌ గ్యాప్‌ గ్రాంట్‌ అంశాన్ని ప్రస్తావించిన జగన్​.. దానికింద రూ.34,125 కోట్లు ఇవ్వాలని మోడీని కోరారు. అలాగే తెలంగాణ డిస్కంలు ఇవ్వాల్సిన రూ.6,627 కోట్లు ఇప్పించాలని , పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇచ్చే రేషన్‌లో హేతుబద్ధత లేదన్న జగన్.. ఫలితంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని విన్నవించారు. చట్టాన్ని సవరించి రాష్ట్రానికి మేలు చేసే చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సాయం చేయాలని మోదీని జగన్​ విజ్ఞప్తి చేశారు. భోగాపురం విమానాశ్రయానికి క్లియరెన్స్‌లు ఇవ్వాలని.. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధాని కోరారు. ఇక ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ భీమవరం లో ఏర్పటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు తెలంగాణ లో బిజెపి జాతీయ కార్య నిర్వహణ సమావేశాల్లో పాల్గొన్న మోడీ..ఈరోజు ఉదయం బేగంపేట్ నుండి నేరుగా గన్నవరం చేరుకున్నారు.