అసైన్డ్ భూములు బలవంతంగా గుంజుకుంటున్నారు: అచ్చెన్నాయుడు

ఒక్కో వర్గానికి జరిగిన అన్యాయాన్ని వివరించిన అచ్చెన్నాయుడు

AP TDP President Achennaidu
AP TDP President Achennaidu

అమరావతిః టిడిపి ఏపి అధ్యక్షుడు అచ్చెనాయుడు సిఎం జగన్‌ పై విమర్శలు గుప్పించారు. జగన్ బీసీలను, దళితులను, గిరిజనులను, మైనార్టీలను మోసం చేశారని ఆరోపిస్తూ శనివారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు, 10 మంత్రి పదవులు ఇచ్చామని అదే సామాజిక న్యాయమని వైఎస్‌ఆర్‌సిపి మోసపూరిత తీర్మానాలు చేసిందన్నారు. బీసీలకు 56 కార్పొరేటషన్లు ఇచ్చి, రెండో వైపు 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి, స్థానిక ఎన్నికల్లో 16,800 పదవులను దూరం చేసిందన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ. 26 వేల కోట్లు దారి మళ్లించడం, 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం బీసీలను దగా చేయడం కాదా? అని ప్రశ్నించారు.

దళితుల సబ్ ప్లాన్ నిధులు రూ. 7200 కోట్లు దారి మళ్లించి, 11,500 ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి కూడా రూ. 1000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని, 81 గురుకుల పాఠశాలలను సాధారణ పాఠశాలలుగా మార్చేందుకు కుట్ర చేశారన్నారు. మైనార్టీ సంక్షేమ నిధులు రూ. 1,483 కోట్లను కూడా దారి మళ్లించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దుల్హన్, రంజాన్ తోఫా, దుకాన్ మకాన్ వంటి పథకాలను రద్దు చేశారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన అసైన్డ్ భూములన్నీ బలవంతంగా గుంజుకోవడం, పారిశ్రామిక రాయితీలను రద్దు చేయడం, నాణ్యమైన విద్యను దూరం చేయడం, వందలాది మందిని హత్య చేయడం సామాజిక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/