కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరిన జగన్
కోర్టుకు రాలేను.. ట్రాఫిక్ ఇబ్బందులొస్తాయి: జగన్ పిటిషన్
అమరావతి: కోడి కత్తి కేసుకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కోర్టుకు హాజరుకావాలని గత వాయిదాలో మెజిస్ట్రేట్ పేర్కొన్న నేపథ్యంలో జగన్ పిటిషన్ వేశారు. ‘‘రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాల సమీక్షలు ఉన్నాయి. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అడ్వకేట్ కమిషనర్ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలి’’ అని పిటిషన్లో జగన్ అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కోర్టును మినహాయింపును కోరిన సంగతి తెలిసిందే. జగన్ తరపున ఆయన పీఏ కె నాగేశ్వరరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
కాగా, 2018 అక్టోబర్ లో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగింది. ఎయిర్ పోర్టులోని ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీనివాస్ ఆయనపై దాడి చేశారు. ఆ గాయంతోనే జగన్ నేరుగా హైదరాబాద్ కు వచ్చి చికిత్స చేయించుకున్నారు.