‘సిరివెన్నెల’ కుటుంబానికి పెద్ద సాయం చేసి జగన్.. తన గొప్ప మనసు చాటుకున్నారు

సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక సాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. నవంబర్‌ 24న సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు.

సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి కి ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

30/11/2021 ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారి కార్యాలయం నుండి శాస్త్రి గారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని ప్రభుత్వం భరిస్తుందని, శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఆదేశించినట్లుగా తెలిసింది. శ్రీ సిరివెన్నెల నవంబర్ 30వ తేదీ సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తులైనారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు.