వైద్య ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్

వైద్య ఆరోగ్యశాఖలో భారీ పోస్టులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ భర్తీ చేయాలన్నారు. అక్టోబరు నుంచి ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియ నవంబర్‌ 15 నాటికి ముగించాలన్నారు. కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని’ అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశం చేశారు.