జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తో టేకాఫ్ అయినా కాసేపటికే కిందకు దిగింది. దీంతో తన ఢిల్లీ ప్రయాణం రేపటికి వాయిదా వేసుకున్నారు. ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంకోసం సీఎం జగన్ సోమవారం సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ విమానం 5:03 గంటలకు టేకాఫ్‌ అయ్యింది. కాసేపటికే పైలట్‌ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యింది.

ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్‌ సమస్య తలెత్తిందని పైలట్‌ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్‌ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. తర్వాత సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం తిరిగి సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సీఎంఓ అధికారులు వెల్లడించారు.